రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో మెరిసింది. క్వార్టర్ ఫైనల్లో వెస్ట్ జోన్పై 52 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. బుధవారం ముగిసిన మ్యాచ్లో నార్త్ బౌలర్ అబిద్ ముస్తాక్ చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు.
మ్యాచ్ చివరి రోజున వెస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ను 220/7 స్కోరుతో కొనసాగించింది. లక్ష్యానికి 67 పరుగుల దూరంలో ఉన్న ఈ జట్టును నార్త్ బౌలర్లు ఎక్కువసేపు నిలువనివ్వలేదు. అబిద్ ముస్తాక్ (4/60) ధాటికి వెస్ట్ జోన్ బ్యాటింగ్ క్రమం గంటలోపే కుప్పకూలింది. మొత్తం 234 పరుగులకే ఆలౌటై ఓటమి చవిచూసింది.
ఓవర్నైట్ బ్యాటర్ తనుష్ కొటియన్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. మరో బ్యాటర్ తుషార్ దేశ్పాండే (5) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఉర్విల్ పటేల్ (25) ఓవర్నైట్ స్కోరుకు 8 పరుగులు మాత్రమే జోడించి చివరి వికెట్గా వెనుదిరిగాడు. దీంతో నార్త్ జోన్ లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది.
మూడో రోజు ముగిసే సమయానికి వెస్ట్ జోన్ 195/3తో బలమైన స్థితిలో కనిపించింది. అయితే ఆ తర్వాతి దశలో ముషీర్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్ కీలక వికెట్లు కోల్పోవడం మ్యాచ్లో మలుపు తీసుకొచ్చింది. ఆ దశ నుంచి నార్త్ జోన్ బౌలర్లు మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్నారు.
ఈ మ్యాచ్లో అబిద్ ముస్తాక్ మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్ను ఛిద్రము చేశాడు. అతని అద్భుత బౌలింగ్కు గుర్తింపుగా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఈ మ్యాచ్లో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 251 పరుగులు చేసింది. జవాబుగా వెస్ట్ జోన్ 187 పరుగులకే ఆలౌటైంది. 64 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన నార్త్ జోన్ 222 పరుగులకే ఆలౌటై వెస్ట్కు 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో వెస్ట్ జోన్ 234 పరుగులకే పరిమితమైంది.
ఈ విజయంతో నార్త్ జోన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అక్కడ సౌత్ జోన్తో తలపడనుంది. ఈ పోరులో విజేత ఫైనల్కు అర్హత సాధించనుంది.







