గత రెండ్రోజులు నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం మార్కెట్లను ముందుకు నడిపిస్తోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ స్టాక్‌లపై మదుపర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (94.71) స్థిరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి

గత సెషన్ ముగింపు (76,478)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 150 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి వెళ్లింది. ఉదయం 9:40 గంటల సమయంలో సెన్సెక్స్ 282 పాయింట్ల లాభంతో 76,760 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 89 పాయింట్ల లాభంతో 23,954 వద్ద కదలాడుతోంది.

సెన్సెక్స్‌, నిఫ్టీలో డాబర్ ఇండియా, ఎమ్‌సీఎక్స్ ఇండియా, శ్రీ సిమెంట్స్, నెస్ట్లే, పేజ్ ఇండస్ట్రీస్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). కేపీఐటీ టెక్, టాటా ఎలాక్సీ, అవెన్యూ సూపర్ మార్కెట్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, జిందాల్ స్టీల్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 123 పాయింట్ల లాభంతో ఉంది.