నగరంలోని పాతబస్తీ సైదాబాద్‌లో ఉన్న సక్సెస్ స్కూల్‌లో హోమ్‌వర్క్‌కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి కల్మా, సూరహ్ ఫాతిహా చదివి రావాలని హోమ్‌వర్క్ ఇవ్వడంతో పాటు అదే విషయాన్ని స్కూల్ డైరీలో కూడా రాయడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి సదరు టీచర్‌ను ప్రశ్నించారు. తమ కుమారుడికి ఇలాంటి హోమ్‌వర్క్ ఎందుకు ఇచ్చారంటూ వివరణ కోరారు.

తమ పిల్లలకు మతపరమైన అంశాలను నేర్చుకోవాలని చెప్పడంపై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయగా, 'మా స్కూల్‌లో చదవాలంటే ఇవి నేర్చుకోవాల్సిందే' అని సదరు టీచర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం, సంబంధిత టీచర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.