రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్: రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఆర్థిక విద్య కార్యక్రమాల భాగంగా ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచేందుకు విస్తృత చర్యలు చేపట్టింది. ఆర్థిక సమావేశం, ఆర్థిక విద్య అనే రెండు అంశాలను అభివృద్ధి బాధ్యతలో కీలక భాగాలుగా RBI పరిగణిస్తోంది. ఈ దిశగా బ్యాంకులు, ఇతర భాగస్వామ్య సంస్థలు ఉపయోగించుకునేలా 13 భాషల్లో సమాచార పత్రాలు, విజ్ఞప్తులు, ప్రచార సామగ్రిని RBI తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
ఆర్థిక ఉత్పత్తులు, సేవలు, మంచి ఆర్థిక అలవాట్లు, డిజిటల్ లావాదేవీలు, వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం. ప్రతి సంవత్సరం ముఖ్య అంశంపై కేంద్రీకృత ప్రచారం ద్వారా నిర్వహించే ఫైనాన్సియల్ లిటరసీ వీక్ కూడా ఈ ప్రయత్నాల్లో భాగమే.
ఫైనాన్సియల్ లిటరసీ వీక్ 2026ను “KYC - యువర్ ఫస్ట్ స్టెప్ టూ సేఫ్ బ్యాంకింగ్ ” అనే అంశంతో ఫిబ్రవరి 09 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా Know యువర్ కస్టమర్ (KYC) ప్రాథమిక అంశాలు, సెంట్రల్ KYC రిజిస్ట్రీ (CKYC), ఖాతా పరిశుభ్రత, క్రమశిక్షణ వంటి విషయాలపై పోస్టర్లు, లీఫ్లెట్లు, వీడియోల ద్వారా సందేశాలు ప్రజలకు చేరవేయనున్నారు. ఈ ప్రచార సామగ్రి RBI వెబ్సైట్లోని ‘ డౌన్లోడ్స్’ విభాగంలో “ ఫైనాన్సియల్ లిటరసీ వీక్ 2026” శీర్షిక కింద ఉంచబడింది.
ఇటీవలి కాలంలో KYC పేరుతో జరుగుతున్న ఆన్లైన్ మోసాలపై RBI ప్రత్యేకంగా హెచ్చరిస్తోంది. “మీ KYCని అప్డేట్ చేయండి, లేకపోతే మీ బ్యాంకు ఖాతా బ్లాక్ చేయబడుతుంది” వంటి సందేశాలు మొబైల్ ఫోన్లు, ఇమెయిల్ల ద్వారా ప్రజలకు పంపుతూ మోసగాళ్లు ఖాతాదారులను భయపెట్టి లింకులపై క్లిక్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. RBI స్పష్టంగా ఇవి మోసపూరిత సందేశాలని, భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తోంది.
మోసగాళ్లు నకిలీ అత్యవసర పరిస్థితులను సృష్టించి, వెంటనే చర్య తీసుకోవాలని ఒత్తిడి తెస్తారని RBI వివరిస్తోంది. ఇలాంటి మోసాల నుంచి రక్షించుకునేందుకు మూడు సులభ నియమాలను పాటించాలని సూచిస్తోంది – ముందుగా ఆగాలి, తొందరపడి చర్య తీసుకోకూడదు; తర్వాత ఆలోచించాలి, బ్యాంకులు లేదా NBFCలు KYC అప్డేట్ కోసం లింకులు పంపవని గుర్తుంచుకోవాలి; చివరగా సరైన చర్య తీసుకోవాలి, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకూడదు, OTP, PIN, పాస్వర్డ్ వంటి గోప్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు.
ఇలాంటి సందేశాలు వచ్చినప్పుడు నేరుగా సంబంధిత బ్యాంక్ లేదా NBFC అధికారిక సంప్రదింపు మార్గాల ద్వారా మాత్రమే సంప్రదించాలని RBI సూచిస్తోంది. “తెలియని లింక్ = తెలియని ప్రమాదం” అనే సందేశంతో RBI ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను సురక్షితంగా వినియోగించాలని పిలుపునిస్తోంది.
ఆర్థిక విద్య, సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులపై మరిన్ని వివరాలు, విద్యా సామగ్రి కోసం RBI ప్రత్యేకంగా రూపొందించిన వెబ్పేజీ https://m.rbi.org.in/FinancialEducation/ను సందర్శించవచ్చని సంస్థ తెలిపింది.






