బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన ‘ధురంధర్‌ 2: ది రివెంజ్‌’ ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ‘ధురంధర్‌’ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ఈ క్రైమ్‌ యాక్షన్‌ చిత్రం ద్వారా రణ్‌వీర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ విజయోత్సాహంతో ఆయన ఇప్పుడు జాంబీ థ్రిల్లర్‌ ‘ప్రళయ్‌’ ద్వారా సినీప్రియుల ముందుకు రావడానికి సన్నద్ధమవుతున్నాడు.

సెప్టెంబరులో సెట్స్‌పైకి వెళ్లాల్సిన ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ ముందుగా అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుందని బాలీవుడ్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి. జై మెహతా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ద్వితీయార్ధంలో చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. షూటింగ్‌లో ఎక్కువ భాగం ఆస్ట్రేలియాలో జరగనుందని సమాచారం.

‘ప్రళయ్‌’ కోసం రణ్‌వీర్‌ సింగ్‌ ఇప్పటికే శారీరకంగా, మానసికంగా ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. జాంబీల ప్రపంచాన్ని తెరపై నిజ జీవితానికి దగ్గరగా చూపించేందుకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ కీలక పాత్ర పోషించనున్నాయని, ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

‘‘జై మెహతా దర్శకత్వంలో రూపొందనున్న ‘ప్రళయ్‌’ చిత్రీకరణ ద్వితీయార్ధంలో ప్రారంభం కానుంది. షూటింగ్‌లో ఎక్కువ భాగం ఆస్ట్రేలియాలో జరగనుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా సన్నద్ధమవుతున్నాడు రణ్‌వీర్‌. ఈ చిత్రంలో జాంబీల ప్రపంచానికి జీవం పోయడంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. రణ్‌వీర్‌ ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోలిస్తే ప్రత్యేకంగా నిలుస్తుందీ చిత్రం’’ అని బాలీవుడ్‌ సినీ వర్గాలు తెలిపాయి.

ముంబయి భవిష్యత్తు విపత్తు నేపథ్యంలో ఈ సినిమా కథ నడవనుందని సమాచారం. జాంబీల దాడి సమయంలో ప్రాణాలతో పోరాడే ఒక వివాహిత జంట చుట్టూ కథ తిరుగుతుందని, భారీ యాక్షన్‌ సన్నివేశాలకు భావోద్వేగాలను మేళవించి జాంబీ జానర్‌లో సరికొత్తగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని పరిశ్రమలో చర్చ నడుస్తోంది.

రణ్‌వీర్‌ సింగ్‌ సరసన కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్‌ నటించనున్నట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ‘ధురంధర్‌ 2: ది రివెంజ్‌’ విజయంతో రణ్‌వీర్‌ కెరీర్‌ మరో మెట్టు ఎక్కిన సమయంలో వస్తున్న ‘ప్రళయ్‌’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. జాంబీ థ్రిల్లర్‌ జానర్‌లో బాలీవుడ్‌ స్థాయిని పెంచే చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.