రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
బద్రీనాథ్ ఆలయానికి వచ్చిన విరాళాల నిర్వహణలో జరిగిన అవకతవకల పై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆలయ విరాళాల నిర్వహణ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచేందుకు.. ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకురావాల్సిన సంస్కరణలను బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ (BKTC)కి విచారణ అనంతరం సూచించాలని ప్రభుత్వం ఆదేశించింది. బీకేటీసీ ఉత్తరాఖండ్లో బద్రీనాథ్తోపాటు మరో 44 ఆలయాలు, పలు పాఠశాలలు, ధర్మశాలలను నిర్వహిస్తోంది.
ఆలయ విరాళాలను ఎవరు చోరీ చేశారనే విషయం తెలుసుకోవడానికి ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఆలయానికి వచ్చిన విరాళాల రికార్డులు, నగదు నిర్వహణ, విరాళాల సేకరణ, లెక్కింపునకు సంబంధించిన విధానాలు, ఇతర పత్రాలను సమీక్షిస్తున్నామన్నారు. ఆలయ కమిటీలోని వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు విరాళాల నిర్వహణలో జరిగిన అక్రమాలపై ఇప్పటికే బీకేటీసీ అంతర్గత విచారణకు ఆదేశించింది. అక్రమాలకు పాల్పడినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించడంతో ప్రమోద్ నౌట్యాల్ అనే ఉద్యోగిని సస్పెండ్ చేశామని బీకేటీసీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది తెలిపారు.







