రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: ఆన్లైన్ మెసేజింగ్ యాప్ల భద్రత, చట్టపరమైన అమలుపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా టెలిగ్రామ్కు నోటీసులు జారీ చేసింది. కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడుతున్న ఛానళ్లు, కంటెంట్పై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్ను ఆదేశించింది.
కాపీరైట్ ఉల్లంఘనను కేవలం సివిల్ కేసుగా మాత్రమే కాకుండా, క్రిమినల్ నేరంగా కూడా పరిగణిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. టెలిగ్రామ్ వేదికగా పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్ ఎక్కువగా షేర్ అవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
పైరసీ కంటెంట్ను వీలైనంత త్వరగా తొలగించాలని టెలిగ్రామ్కు కేంద్రం సూచించింది. ఈ దిశగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారో వివరించేలా 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని అల్టిమేటం జారీ చేసింది.
ప్రొడ్యూసర్లు, ఓటీటీ ప్లాట్ఫామ్లు, దర్యాప్తు సంస్థల కోసం టెలిగ్రామ్ ఎలాంటి గ్రీవెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసిందో కూడా కేంద్రం వివరాలు కోరింది. కాపీరైట్ ఉల్లంఘనపై ఫిర్యాదులు అందినప్పుడు వాటిని ఎలా పరిష్కరిస్తున్నారన్న అంశంపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.
ఇటీవల నీట్ పరీక్ష ప్రశ్నపత్రాలు టెలిగ్రామ్లో లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల పాటు ఈ మెసేజింగ్ యాప్ను దేశంలో తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఆ సంఘటన తర్వాత తాజాగా నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న ప్రకటనలు, సైబర్ మోసాల ముప్పు దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇన్స్టాగ్రామ్, మెటాకు కూడా నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద ప్రకటనలపై వివరణ ఇవ్వాలని మెటాను కేంద్రం ఆదేశించింది.
డిజిటల్ వేదికలపై కంటెంట్ నియంత్రణ, వినియోగదారుల భద్రత, కాపీరైట్ హక్కుల పరిరక్షణకు సంబంధించి కేంద్రం వరుసగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో టెలిగ్రామ్పై తాజా నోటీసులు మరింత చర్చనీయాంశంగా మారాయి.







