దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు లాభాల్లో ముగిశాయి. గురువారం ఉదయం భారీ లాభాల్లో కదలాడిన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణకు దిగడంతో దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. ఇంట్రాడే గరిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ 700 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ 24 వేల ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 77,391.07 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,991.22) లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 77,803.18 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో చివరికి 109.25 పాయింట్ల లాభంతో 77,100.47 వద్ద ముగిసింది. నిఫ్టీ 34.35 పాయింట్ల లాభంతో 24,056 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 94.40గా ఉంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండిగో, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, బీఈఎల్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర బ్యారెల్‌ 72 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3984 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.