రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
ఇరాక్కు చెందిన సాయుధ బృందం సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చిన వారికి 10 మిలియన్ అమెరికన్ డాలర్ల(భారత కరెన్సీలో సుమారు రూ.85 కోట్లు) రివార్డ్ ప్రకటించింది. ఈ మేరకు ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్గా పిలిచే ఓ సాయుధ సంస్థ ఈ సంచలన ప్రకటనను విడుదల చేయగా.. సంబంధిత సోషల్ మీడియా వేదికలు ప్రచారం చేశాయి. అయితే.. ఇరాక్ ప్రభుత్వం మాత్రం దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు. అటు.. ఈ అంశంపై అమెరికా నుంచీ ఎలాంటి అధికారిక స్పందనా లేదు.
ఆ ప్రకటనలో ట్రంప్ ఓ నేరస్థుడని ఇస్లామిక్ రెసిస్టెన్స్ పేర్కొంది. ఇరాన్ మద్దతున్న సీనియర్ కమాండర్లు ఖాసిమ్ సోలేమానీ, అబూ మహ్దీ అల్ ముహందిస్ మృతికి ట్రంప్ బాధ్యుడని ఆరోపించింది. తమ నాయకుల హత్యకు ప్రతీకారం కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించింది. అమెరికా పాలకుల నైతిక పతనానికి ట్రంప్ చర్యలే కారణమని ఆరోపిస్తూ ఖురాన్లోని ఓ వ్యాక్యాన్ని కూడా ప్రస్తావించింది.
కాగా.. 2020 జనవరిలో బాగ్దాద్(ఇరాక్ రాజధాని) ఎయిర్పోర్ట్ సమీపంలో అమెరికా చేపట్టిన డ్రోన్ దాడిలో ఐఆర్జీసీ అధ్యక్షుడు ఖాసిమ్ సోలేమానీ, ఇరాక్ మిలీషియా నేత అబూ మహ్దీ అల్ ముహందిస్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. నాటి నుంచి ఇరాన్ అనుబంధ సాయుధ బలగాలు.. అమెరికా ప్రయోజనాలు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని పలుమార్లు బెదిరింపులకు దిగుతూనే ఉన్నాయి. తాజా ప్రకటనతో ట్రంప్ భద్రతపై మరోసారి చర్చలు జోరందుకున్నాయి. ఇక ఇలాంటి హెచ్చరికలను అమెరికా భద్రతా సంస్థలు అత్యంత తీవ్రంగా పరిగణించి భద్రతను మరింత పటిష్ఠం చేస్తుంటాయి.







