రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
విశాఖలో అలల ఉధృతికి బోటు బోల్తా..
ఆందోళనలో మత్స్యకారులు
విశాఖ హార్బర్ సమీపంలో చేపల వేటకు వెళ్లిన బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు.. హార్బర్ సమీపంలో చేపల వేటకు వెళ్లిన బోటు అలల తీవ్ర ఉధృతికి అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోని రాళ్ల మధ్య చిక్కుకుపోయారు. అయితే బోటును పట్టుకుని ఉండటంతో వారు సురక్షితంగా బయటపడగలిగారు. ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులకు గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో బోటుతో పాటు చేపల వలలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో సుమారు రూ.4.5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత మత్స్యకారులు తెలిపారు. తమ జీవనాధారం కోల్పోయామని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని మత్స్యకార కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.







