రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు ఐటీ, పీఎస్యూ బ్యాంక్, రియాల్టీ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు వరుసగా రెండో రోజూ రాణించాయి. దీంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్కరోజే దాదాపు రూ.6 లక్షల కోట్లు పెరిగి రూ.482 లక్షల కోట్లకు చేరింది.
సెన్సెక్స్ ఉదయం 77,395.63 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,741.82) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 77,642.23 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 827.57 పాయింట్ల లాభంతో 77,569.39 వద్ద ముగిసింది. నిఫ్టీ 244.10 పాయింట్ల లాభంతో 24,206.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.31గా ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో రిలయన్స్, టెక్ మహీంద్రా, బీఈఎల్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి. ఎటర్నల్, భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మా, ట్రెంట్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 76.17 డాలర్లుగా ఉంది. బంగారం ఔన్సు 4,108 డాలర్ల వద్ద కొనసాగుతోంది. షాంఘై మినహా ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా.. యూరోపియన్ మార్కెట్లూ లాభాల్లో ట్రేడింగ్ను ఆరంభించాయి.







