రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్:
మచిలీపట్నంలోని మంగినపూడి బొట్లవానిపాలెంలో దారుణం జరిగింది. క్షణికావేశంలో కన్నకొడుకుపై తండ్రి కర్రతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రామ్మోహన్ రావు అనే వ్యక్తి బొట్లవానిపాలెంలో భార్య, కొడుకు కళ్యాణ చక్రవర్తి(30)తో కలిసి జీవిస్తున్నారు. అయితే గత రాత్రి తల్లి, కొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరడంతో వారికి సర్ది చెప్పేందుకు రామ్మోహన్ రావు యత్నించాడు.
ఎంతకీ గొడవ ఆపకపోవడంతో క్షణికావేశంలో పక్కనే ఉన్న కర్రతో కుమారుడిపై తండ్రి దాడి చేశాడు. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఘటనాస్థలంలోనే చక్రవర్తి చనిపోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తండ్రి చేతిలో కొడుకు దుర్మరణం చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.







