స్పందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోపైకి లారీ దూసుకెళ్లి నలుగురు మృతిచెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గిద్దలూరుకు చెందిన ఆవుల వీరక్కకు, కంభంకు చెందిన పాములేటికి ఈరోజు ఉదయం 9:30 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. అయితే, వివాహానికి ముందు వినాయకుడి ఆలయం వద్ద పెళ్లికూతురితో కొబ్బరికాయ కొట్టించేందుకు పెళ్లి బృందం ఆగింది. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ.. ఆటోతో పాటు స్థానికులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆవుల అలకనంద (19), ఆవుల అంకాలు (20), ఆవుల నగేష్ (17), ఆవుల నాగేశ్వరి (1.5) మృతిచెందారు. పెళ్లికూతురితో పాటు మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

స్పందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. పెళ్లింట జరిగిన ఈ ప్రమాదం తన మనసును తీవ్రంగా కలచివేసిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత వైద్యాధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా ప్రయాణికులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.