రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
‘ది ఇండియా స్టోరీ’ టీజర్ రిలీజ్
– కల్తీ ఆహారంపై కాజల్ కొత్త సినిమా
కథానాయిక కాజల్ కీలక పాత్రలో, దర్శకుడు చెట్టన్ డీకే రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ది ఇండియా స్టోరీ’ టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది. శుక్రవారం ఆన్లైన్లోకి వచ్చిన ఈ టీజర్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సామాన్య ప్రజల రోజువారీ జీవితానికి నేరుగా సంబంధించిన కల్తీ ఆహార సమస్యను ఈ చిత్రం కేంద్రబిందువుగా తీసుకుంది. మన వంటింట్లో వాడే నిత్యావసర సరుకుల నుంచి పిల్లలు తాగే పాల వరకూ దాదాపు ప్రతిదీ కల్తీ మయమైపోయిన పరిస్థితిని టీజర్లో చూపించారు. ఈ నేపథ్యంలోనే చిత్ర కథను మలిచినట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది.
పురుగు మందుల అధిక వినియోగం, వ్యవసాయంలో రసాయనాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, కల్తీ ఆహారం కారణంగా ప్రజల ఆరోగ్యంపై పడుతున్న భారం వంటి అంశాలను ‘ది ఇండియా స్టోరీ’లో ప్రాధాన్యంగా చూపించనున్నట్లు చిత్ర యూనిట్ ముందుగా వెల్లడించిన విషయం తెలిసిందే. టీజర్లో కూడా ఈ సమస్యల తీవ్రతను సూచించే దృశ్యాలు చోటుచేసుకున్నాయి.
ఈ చిత్రంలో కాజల్ న్యాయవాదిగా కనిపించనున్నారు. కల్తీ ఆహార మాఫియాపై న్యాయపోరాటం చేసే పాత్రలో ఆమె నటిస్తున్నట్లు టీజర్ సంకేతాలు ఇస్తోంది. కోర్టు సన్నివేశాలు, విచారణ దృశ్యాలు, బాధితుల వేదనను చూపించే షాట్లు టీజర్లో కాస్త గట్టిగా కనిపిస్తున్నాయి.
శ్రేయాస్ తల్పాడే, త్రిష శారద, మురళీశర్మ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సామాజిక అంశంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలగలిపి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టీజర్ కట్ చూస్తే అనిపిస్తోంది. నేపథ్య సంగీతం, కట్టింగ్ కూడా టెన్షన్ వాతావరణాన్ని సృష్టించేలా ఉంది.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ది ఇండియా స్టోరీ’ జూలై 24న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్తీ ఆహారంపై గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందన్న ఆసక్తి సినీ ప్రేమికుల్లో పెరుగుతోంది.







