పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరుగుతున్న నిరసనల నడుమ, అక్కడి గిల్గిట్-బాల్టిస్తాన్‌ ప్రాంతానికి తాత్కాలిక ప్రావిన్స్ హోదా కల్పించే దిశగా పాకిస్తాన్ మరో అడుగు వేసింది. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లో ఐదో ప్రావిన్స్‌గా రాజ్యాంగంలో చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుని అక్కడి అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా అనే నాలుగు ప్రావిన్సులు ఉన్నాయి.

పాకిస్తాన్ పరిపాలన కింద ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్‌ ప్రాంతానికి తాత్కాలిక ప్రావిన్స్ హోదా కల్పించాలని కోరుతూ అక్కడి అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానానికి అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ మద్దతు తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే జలాల్ అలీ షా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు స్థానిక నివేదికలు తెలియజేస్తున్నాయి.

గిల్గిట్-బాల్టిస్తాన్‌కు 2009లో గిల్గిట్-బాల్టిస్తాన్ ఎంపవర్‌మెంట్ అండ్ సెల్ఫ్ గవర్నెన్స్ ఆర్డర్ ద్వారా శాసనసభ ఏర్పడింది. అనంతరం 2018 గిల్గిట్-బాల్టిస్తాన్ ఆర్డర్ ద్వారా ఆ శాసనసభకు మరిన్ని చట్టసభ అధికారాలు కల్పించారు. తాజాగా ఆమోదించిన తీర్మానంలో ఈ రెండు ఆదేశాలను ప్రస్తావిస్తూ, ఇప్పుడు తాత్కాలిక ప్రావిన్స్ హోదా ఇవ్వాలని అసెంబ్లీ డిమాండ్ చేసింది.

దివంగత నేత సర్టాజ్ అజీజ్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేసి గిల్గిట్-బాల్టిస్తాన్‌కు తాత్కాలిక ప్రావిన్స్ హోదా ఇవ్వాలని పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ కోరింది. ఈ హోదా లభిస్తే గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రజలకు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభిస్తుందని కూడా తీర్మానంలో పేర్కొన్నట్లు సమాచారం.

పాకిస్తాన్ ఈ చర్యను భారత్‌లో రాజకీయ వర్గాలు, వ్యూహకర్తలు భారత్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించే ప్రయత్నంగా చూస్తున్నారు. గిల్గిట్-బాల్టిస్తాన్‌ను పాకిస్తాన్ వేరుగా పరిపాలిస్తున్నప్పటికీ, ఇది జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లతో పాటు భారత్‌లో అంతర్భాగమేనని భారత్ ఎప్పటి నుంచో స్పష్టం చేస్తోంది.

ఈ ప్రాంతాల హోదాను మార్చేందుకు పాకిస్తాన్ చేపట్టే ఏ చర్యకూ చట్టబద్ధత లేదని, అలాంటి చర్యలతో వాస్తవ పరిస్థితి మారదని భారత్ పలుమార్లు ప్రకటించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో పాక్ ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరుగుతున్న సమయంలో గిల్గిట్-బాల్టిస్తాన్‌కు ప్రావిన్స్ హోదా ప్రయత్నం ప్రారంభించడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.