రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
మిసైల్ తయారీ బాధ్యతలు ప్రైవేటు సంస్థలకు
కేంద్రం కీలక నిర్ణయం!
రక్షణ రంగంలో మరో భారీ సంస్కరణకు కేంద్రం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మిసైల్ తయారీ బాధ్యతలను ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు కేంద్రం నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. భారత రక్షణ రంగ ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్కు తగ్గట్టు సరఫరా పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. డీఆర్డీఓ తయారు చేసిన అస్త్ర మిసైల్ కొనుగోలుకు ఇటీవల ఇండోనేషియా ఆసక్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అస్త్ర మార్క్-2 మిసైల్ తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి రక్షణ శాఖ త్వరలో ప్రతిపాదనలు ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఐసీఓఎమ్ఎమ్, అదానీ, భారత్ ఫోర్జ్, టాటా గ్రూప్, మహీంద్రా గ్రూప్ తదితర సంస్థలు తమ ప్రతిపాదనలను సమర్పించే అవకాశం ఉందని సమాచారం.
ఏమిటీ అస్త్ర మార్క్-2..
గగనతల లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు భారత్ సిద్ధం చేసిన ఈ మిసైల్ గరిష్ఠంగా 200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. చైనాకు చెందిన దీర్ఘ శ్రేణి ఎయిర్ టూ ఎయిర్ మిసైల్ పీఎల్-15ఈకి పోటీగా భారత్ ఈ క్షిపణిని సిద్ధం చేసింది. తెజస్ మార్క్ 1ఏ, మిగ్-29, సుఖోయ్-30 ఎమ్కేఐ, రఫేల్ మెరైన్ ఫైటర్ విమానాల నుంచి ఈ మిసైల్ను ప్రయోగించవచ్చు. బాలిస్టిక్ క్షిపణి అయిన ప్రళయ్ తయారీ బాధ్యతలను కూడా ప్రైవేటు రంగానికి అప్పగించడంపై కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విమానాలు, డ్రోన్స్, ఆర్టిలరీ, యుద్ధ నౌకల తయారీకే ప్రైవేటు రంగం పరిమితమైన విషయం తెలిసిందే.







