రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్: సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్
అభ్యంతరకర వ్యాఖ్యలను ఉపేక్షించొద్దు.. పోలీస్ శాఖకు సీఎం ఆదేశాలు
సోషల్ మీడియా అంశంపై ఏపీ కేబినెట్లో సీరియస్గా చర్చ జరిగింది. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాపై డీజీపీ, ఇతర పోలీస్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నేతలను కించపరుస్తూ వస్తున్న వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తూనే అభ్యంతరకర వ్యాఖ్యలను ఏ మాత్రం ఉపేక్షించవద్దని పోలీస్ అధికారులకు కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం వెంటనే టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను మంత్రిమండలి ఆదేశించింది. అవసరమైతే బయటనుంచి సిబ్బందిని తీసుకోవాలని సూచించింది.
న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా కొత్తగా పీపీలను నియించుకోవాలని ఏపీ కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంపై అభూత కల్పనలు, అసత్యాలు, అసలు విషయాలు వక్రీకరిస్తే మాత్రం ఉపేక్షించవద్దని మంత్రు గట్టిగా కోరినట్లు తెలుస్తోంది. ఈరోజు నుంచే సోషల్ మీడియాపై పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాపై ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీలో కూడా చర్చించాలని ఆదేశించింది. వైసీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం నుంచి దృష్టి మరల్చేందుకు కొత్త పద్ధతి ఎన్నుకున్నారని మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పారు. వారు కావాలని ఎమ్మెల్యేలను రెచ్చగొడుతున్నారని... వైసీపీ వాళ్లు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని సూచించారు. వైసీపీ ట్రాప్లోకి లాగేందుకు చూస్తోందని.. జాగ్రత్తగా ఉండాలన్నారు.
అనంతపురం సహా మిగతా జిల్లాలలో జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలకు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇన్ఛార్జి మంత్రులు.. రెవెన్యూ, ఇతర సమస్యలపై కూడా ఫోకస్ పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.







