నాడు KGF.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ మైన్

: సీఎం చంద్రబాబు

గోల్డ్ మైనింగ్‌తో జొన్నగిరిలో పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘‘రాయలసీమను రతనాల సీమగా మార్చడం జొన్నగిరి నుంచే ప్రారంభమవుతుంది.  ఈ ప్రాంతాన్ని గతంలో సువర్ణగిరి అని పిలిచేవారు. అశోకుడి నాలుగో రాజధాని ఇది. జొన్నగిరిని సువర్ణగిరిగా మార్చుకుందామా? వందల ఏళ్ల క్రితమే ఈ ప్రాంతం బంగారం, రత్నాలతో నిండింది. అశోకుడి శాసనాలు ఈ ప్రాంత వైభవాన్ని చాటి చెబుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి సీమను కాపాడాలనే ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీఆర్‌. ఆయన నిర్ణయంతో రాయలసీమ ప్రాంతానికి ప్రాణం పోశాం. 

ఒకప్పుడు కేజీఎఫ్‌ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జొన్నగిరి గురించి చర్చ జరుగుతుంది. చమురు తర్వాత దిగుమతికి అధికంగా విదేశీ మారక ద్రవ్యం వాడేది బంగారానికే. ఇక్కడ ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి అవుతుంది. ఇప్పటికి 400 కిలోల సామర్థ్యంతో ప్రారంభమైంది. భవిష్యత్తులో వెయ్యి కిలోలకు చేరుతుంది. ఇప్పటికే 800 ఉద్యోగాలు వచ్చాయి. త్వరలో 1500 మందికి ఉపాధి కల్పిస్తాం. భవిష్యత్తులో 5వేల మందికి ఈ గోల్డ్‌ మైన్స్‌లో ఉపాధి దొరుకుతుంది. 

జొన్నగిరి రాష్ట్రానికి ఆదర్శంగా తయారవుతుంది. ఈ ప్రాంతానికి గ్రోత్‌ ఇంజిన్‌గా మారుతుంది. ఇక్కడ నగల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నా. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఆంధ్రప్రదేశ్‌ చిరునామాగా మారింది. రాయలసీమకు ఇన్ని పరిశ్రమలు వస్తాయని అనుకున్నారా?దేశంలోనే అతిపెద్ద డ్రోన్‌ సిటీ కర్నూలులో వస్తోంది. వీలైనంత త్వరగా కర్నూలుకు హైకోర్టు బెంచ్‌ తీసుకొస్తాం. 2028 నాటికి రాయలసీమలో స్టీల్‌ ప్లాంట్‌ ప్రారంభిస్తాం.

నేరాలు చేయడంలో ఆ పార్టీ నేతలు సమర్థులు..

2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంస పాలన నడిచింది. వేంకటేశ్వరస్వామికి అపచారం జరిగితే శిక్షించాలా..లేదా? స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వెళ్లి దండాలు పెడుతున్నారు. దేవుడిని నమ్మే ఏ వ్యక్తి కూడా వాళ్లను క్షమించడు. ప్రజలకు ఏవిధంగా మంచి చేయాలనేదే నా ఆలోచన. గొడ్డలి పార్టీ విషాన్ని చిమ్ముతోంది. నేరాలు చేయడంలో ఆ పార్టీ నేతలు సమర్థులు. సాయికృష్ణ ఘటనకు కూడా కులం రంగు పులిమారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌పై నోరుపారేసుకుంటున్నారు. అలాంటి వారి నోరు మూయించే శక్తి మాకుంది. మెగా డీఎస్సీ పూర్తయిన ఏడాది తర్వాత పేపర్‌ లీకైందని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై చర్చకు రమ్మని మంత్రి లోకేశ్‌ సవాల్‌ విసిరితే రాలేదు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా దాదాపు 11వేల మంది ఉద్యోగులను సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపాం’’ అని చంద్రబాబు అన్నారు.