రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: సిద్ధవటం: సిద్ధవటం రేంజ్ పరిధిలోని సమస్యాత్మక అటవీ ప్రాంతాల్లో రెండు రోజులపాటు కూంబింగ్ నిర్వహించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి కళావతి తెలిపారు. మండల కేంద్రం సిద్ధవటం అటవీ శాఖ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.
కళావతి తెలిపిన వివరాల ప్రకారం, సిద్ధవటం రేంజ్లోని రోళ్ళబోడు, గొల్లపల్లె, సిద్ధవటం ఫారెస్ట్ బీట్ల పరిధిలో ఉన్న అనుమానిత, సమస్యాత్మక అటవీ ప్రాంతాల్లో శనివారం నుండి రెండు రోజులపాటు సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కడప ఇన్చార్జి DFO రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, సబ్ DFO స్వామి వివేకానంద సూచనలతో చేపట్టినట్లు ఆమె వివరించారు.
అటవీ సంపద సంరక్షణలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని కళావతి పేర్కొన్నారు. కొండ ప్రాంతాల్లో ఉన్న అటవీ సంపదను కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆమె స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాల్లో పచ్చదనాన్ని కాపాడేందుకు, పెంపొందించేందుకు ప్రజలంతా సహకరించాలని ఆమె అభిప్రాయపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలని కళావతి సూచించారు. అటవీ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు, అటవీ సంపదను రక్షించేందుకు ఈ తరహా కూంబింగ్ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు.
కూంబింగ్ ఆపరేషన్లో అటవీ శాఖకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో DRO ముక్తార్ భాష, రోళ్ళబోడు బీట్ అధికారి విశ్వనాథ్, సిద్ధవటం బీట్ అధికారి పెంచల రెడ్డి, గొల్లపల్లి బీట్ అధికారి మధు, సాబ్ బావి, రోళ్ళబోడు బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొని, సంబంధిత ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.













