దేశీయ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. గత నాలుగు సెషన్లలో లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు ఊగిసలాడాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, మెటల్‌, రియాల్టీ షేర్ల పతనం సూచీలపై ప్రభావం చూపింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలకు నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్‌ 104.35 పాయింట్లు కోల్పోయి 78,180.72 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 31.65 పాయింట్లు పతనమై 24,398.70 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 30లో హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టైటాన్‌, ఎటర్నల్‌, టీసీఎస్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ట్రెంట్‌, అదానీ పోర్ట్స్, బీఈఎల్‌, ఎల్‌ అండ్‌ టీ, రిలయన్స్‌, ఐసీఐసీఐ షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 94.94గా ఉంది. బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.74 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్‌ 4,137 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.