విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘రణబాలి’ విడుదల తేదీ మారింది. టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా, హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ వోస్లూ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.

దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమాను మొదట సెప్టెంబరు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్రబృందం ముందుగా ప్రకటించింది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ తేదీకి విడుదల సాధ్యంకాలేదు. ఈ నేపథ్యంలో గురువారం ‘రణబాలి’ బృందం కొత్త రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా వెల్లడించింది.

దసరా పండుగ కానుకగా అక్టోబరు 16న ‘రణబాలి’ని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. పండుగ సీజన్‌ కావడంతో ఈ తేదీపై పరిశ్రమ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ మంచి చర్చ నడుస్తోంది.

1854–1878 మధ్య బ్రిటిష్‌ పాలన కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆ కాలం నాటి సామాజిక–రాజకీయ పరిస్థితులను నేపథ్యంగా తీసుకుని రాహుల్‌ సాంకృత్యాన్‌ ఈ కథను మలిచినట్టు సమాచారం. ఇందులో విజయ్‌ దేవరకొండ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. పీరియడ్‌ సెట్టింగ్‌, యాక్షన్‌ ఎపిసోడ్‌లు, భారీ సెట్స్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాకు అజయ్‌–అతుల్‌ సంగీతం అందిస్తున్నారు. వారి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాకు ప్రత్యేకమైన మూడ్‌ తీసుకొస్తుందనే అంచనాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత విజయ్‌–రష్మిక జంటగా నటిస్తున్న తొలి చిత్రం కావడం, ‘ది మమ్మీ’లో విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్నాల్డ్‌ వోస్లూ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించడం వల్ల ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ఇటీవల దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌ ఈ చిత్రంలోని క్లైమాక్స్‌ భాగం సినిమాకు ప్రాణమని పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఆ క్లైమాక్స్‌ ఫైట్‌ కోసం 16 రోజులు షూటింగ్‌ జరిపినట్టు తెలిపారు. అందులోని డ్రామా, విజయ్‌–ఆర్నాల్డ్‌ మధ్య సాగిన పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.

పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా విడుదలకు సన్నాహాలు జరుగుతున్న ‘రణబాలి’పై ఇప్పటికే మంచి బజ్‌ నెలకొంది. దసరా సెలవుల సీజన్‌లో ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏ స్థాయిలో రాణిస్తుందో చూడాలి.