పాకిస్థాన్‌ గగనతలంలో బోయింగ్‌ 737 కార్గో విమానం అదృశ్యమైంది. యూఏఈలోని షార్జా నుంచి కరాచీకి వస్తున్న ఈ విమానం మంగళవారం రాత్రి అకస్మాత్తుగా రాడార్‌ వ్యవస్థల నుంచి కనుమరుగైంది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ముందస్తు సమాచారం అందినట్టు పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు వెల్లడించారు.

విమాన ప్రయాణ వివరాల ప్రకారం, షార్జా నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ఫ్లైట్‌ రాడార్‌ వ్యవస్థలో అసాధారణ సంకేతాలు కనిపించాయి. విమానం వేగంగా కిందకు దిగుతున్నట్లు రికార్డయిన అనంతరం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఆ సమయంలో విమానం బలోచిస్థాన్‌లోని ఒర్మారా సమీపంలో అరేబియా సముద్రంపై ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

గల్లంతైన ఈ పాకిస్తాన్ ప్లేన్ ఆచూకీ కోసం పాకిస్థాన్‌ అధికారులు అత్యవసర గాలింపు చర్యలు ప్రారంభించారు. అరేబియా సముద్రంలో విస్తృతంగా శోధన కొనసాగుతున్నట్టు సమాచారం. రెస్క్యూ కోఆర్డినేషన్‌ సెంటర్‌ను యాక్టివేట్‌ చేసి, నౌకలు, హెలికాప్టర్లు, ఇతర వనరులను వినియోగిస్తూ గాలింపు ఆపరేషన్‌ చేపట్టారు.

ఈ విమానం పాకిస్థాన్‌లోని ప్రైవేట్‌ కార్గో ఎయిర్‌లైన్‌ KE2 ఎయిర్వేస్ కు చెందినదని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నట్టు స్పష్టం చేశారు. వారందరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గాలింపు బృందాలు నిరంతరం శోధన కొనసాగిస్తున్నాయి.

ప్రాథమిక దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, 1999లో ప్రయాణికుల రవాణా కోసం తయారు చేసిన ఈ బోయింగ్‌ 737 విమానాన్ని 2012లో సరకు రవాణా విమానంగా మార్చినట్టు గుర్తించారు. విమానం గత సేవా చరిత్ర, నిర్వహణ రికార్డులు, ఇటీవలి సాంకేతిక తనిఖీల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

విమాన అదృశ్యంపై పాకిస్థాన్‌ సివిల్‌ ఏవియేషన్‌ అధికారులు, KE2 ఎయిర్వేస్ ప్రతినిధులు కలిసి సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రికార్డులు, ఫ్లైట్‌ డేటా, రాడార్‌ సమాచారం, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలన్నింటినీ పరిశీలిస్తూ కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.

అరేబియా సముద్రం పైభాగంలో జరిగిన ఈ ఘటనతో అక్కడి గగనతల భద్రత, కార్గో విమానాల ఆపరేషన్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గల్లంతైన విమానం, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు సిబ్బంది ఆచూకీ కోసం పాకిస్థాన్‌ అధికారులు, రక్షణ బృందాలు సమన్వయంతో గాలింపు చర్యలను వేగవంతం చేస్తున్నారు.