ఇరాన్‌పై అమెరికా ప్రతీకారదాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బ తీసే లక్ష్యంతో యూఎస్ సెంట్రల్ కమాండ్ ముందుకు సాగుతోంది. గురువారం సాయంత్రం హోర్ముజ్ జలసంధికి సమీపంలోని రెండు బ్రిడ్జ్‌లు, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్టుపై యూఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు నిర్వహించింది. బ్రిడ్జ్‌లపై జరిపిన దాడుల్లో ముగ్గురు ఇరాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టు వద్ద జరిగిన కాల్పుల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గత వారం రోజుల్లో అమెరికా దాడుల కారణంగా ఇరాన్‌లో 30 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ రేవులపై అమెరికా దిగ్బంధనాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఒమన్ గల్ఫ్‌లో ప్రయాణించే నౌకలను అమెరికా తనిఖీ చేస్తోంది.

అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ దాడులు..

అమెరికా దాడులకు ప్రతీకారంగా దాని మిత్ర దేశాలైన కువైట్‌, జోర్డాన్‌, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ గురువారం క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. అప్రమత్తంగా ఉన్న ఆయా దేశాలు.. ఇరాన్‌ దాడిని సమర్థంగా తిప్పికొట్టాయి. అహ్వాజ్‌ నగరంలోని షాహిద్‌ బఖే చిన్నపిల్లల క్యాన్సర్‌ ఆస్పత్రిపై అమెరికా బాంబు దాడి చేసినట్లు ఇరాన్‌ ఆరోపించింది. ఈ దాడికి నిరసనగానే తాము అమెరికా మిత్ర దేశాలపై మిసైల్ దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.