రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
కేవలం ఒక్క నిమిషం వ్యవధిలో.. రిక్టర్స్కేల్పై 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన రెండు భారీ భూకంపాలు ఉత్తర వెనెజువెలాను అతలాకుతలం చేశాయి. రాజధాని కారకాస్ సమీపంలోని తీరప్రాంత నగరం లా గ్వైరా అత్యంత తీవ్రంగా దెబ్బతింది. భారీ అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. అనేక ప్రాంతాల్లో శిథిలాల కిందే వందలాది మంది చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
సహాయక చర్యలు మాత్రం ఆశించిన వేగంతో సాగడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల భారీ యంత్రాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు, వాలంటీర్లే చేతులతో శిథిలాలను తొలగిస్తూ తమ ఆత్మీయుల కోసం వెతుకుతున్నారు. ఐదు నెలల చిన్నారి గల్లంతైందంటూ ఓ తల్లి కన్నీరుమున్నీరవుతుండగా, ప్రభుత్వ సహాయం కనిపించడం లేదంటూ మరో బాధితురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అధికారికంగా.. ఇప్పటివరకు 920 మంది మృతి చెందగా, 3,360 మందికి పైగా గాయపడ్డారు. అయితే మరో 50 వేల మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని లోకల్ మీడియా కథనాలు, పలు నివేదికల ఆధారంగా ఐక్యరాజ్యసమితి చెప్తున్నాయి. శిథిలాల కింద ఇంకా 172 మంది చిక్కుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే.. గణాంకాల విషయంలో ప్రభుత్వం దాపరికం ప్రదర్శిస్తుండడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
ప్రజల ఆగ్రహం తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్పై కూడా వ్యక్తమైంది. ఆమె బాధిత ప్రాంతాల్లో పర్యటించినప్పుడు స్థానికులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. పరిస్థితుల దృష్ట్యా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి 8 గంటల తర్వాత ప్రవేశాన్ని అధికారులు తాత్కాలికంగా నిషేధించారు. అదే సమయంలో.. పాజిటివ్ వీడియోలను ప్రభుత్వం వైరల్ చేస్తోంది. సహాయక చర్యల్లో చిన్నారులను, వృద్ధులను, మూగజీవాలను రక్షించిన వీడియోలను రిలీజ్ చేస్తోంది. అయినప్పటికీ.. ప్రజాగ్రహం మాత్రం చల్లారడం లేదు.
ఇదిలా ఉండగా.. ప్రపంచ దేశాలు వెనెజువెలాకు అండగా నిలుస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కనీసం 17 దేశాల నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. చిలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్, మెక్సికో, కొలంబియా, ఎల్ సాల్వడార్ దేశాల బృందాలు ఇప్పటికే సహాయక చర్యల్లో పాల్గొంటుండగా.. అమెరికా కూడా 250 మందికిపైగా సిబ్బంది, ప్రత్యేక శునకాలతో కూడిన సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను పంపేందుకు సిద్ధమైంది.
ఈ భూకంపాల్లో పలువురు విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా తొమ్మిది మంది పోర్చుగల్ పౌరులు, ఐదుగురు స్పెయిన్ పౌరులు, ఇద్దరు బ్రెజిలియన్లు, ఇద్దరు చైనా పౌరులు, ఒక ఇటలీ-వెనెజువెలా పౌరుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు వందలమంది విదేశీయుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.







