అనంతలో హైటెన్షన్..

ఎమ్మెల్యే ఎంఎస్ రాజు Vs మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి

అనంతపురం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకొంది. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపించలేకపోతే చెప్పుతో కొడతానంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నివాసంలో ఇవాళ వైసీపీ శ్రేణుల సమావేశం జరుగుతోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నివాసానికి ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు చేరుకోగా, పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అక్కడికి తరలివస్తున్నారు.

ఇరువర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడికి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో మారణాయుధాలు ఉన్నాయనే సమాచారం. తోపుదుర్తి ఇంట్లో రాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీల సందర్భంగా పోలీసులతో ప్రకాష్‌రెడ్డి తండ్రి ఆత్మారామిరెడ్డి వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.