రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
ఐసీసీ పురుషుల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ తమ అగ్ర స్థానాలను నిలబెట్టుకున్నారు. తాజా ర్యాంకింగ్స్ అప్డేట్లో వీరిద్దరూ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. కాకపోతే..ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన అభిషేక్ శర్మ రెండో స్థానంలోకి పడిపోయాడు. మరోవైపు, భారత్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఘనమైన ఆరంభాన్ని అందుకోవడంతో ఆ జట్టు ఆటగాళ్లు తమ ర్యాంకింగ్స్ను గణనీయంగా మెరుగుపర్చుకున్నారు.
తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన ఇంగ్లాండ్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా మూడో టీ20లో ఇంగ్లండ్ 125 పరుగుల రికార్డు విజయాన్ని నమోదు చేసింది. టీ20 ఫార్మాట్లో భారత్కు ఇదే అత్యంత భారీ ఓటమి కావడం గమనార్హం. రెండో టీ20లో 46 బంతుల్లో 76 పరుగులతో నాటౌట్గా నిలిచి ఇంగ్లాండ్ను గెలిపించిన జాకబ్ బెథెల్, ఏడు స్థానాలు ఎగబాకి బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 8వ స్థానానికి చేరుకున్నాడు.
అలాగే ఆల్రౌండర్ సామ్ కరన్ మూడు విభాగాల్లోనూ మెరుగైన ర్యాంకులు సాధించాడు. రెండో మ్యాచ్లో 3/33 వికెట్లు తీసి, మూడో మ్యాచ్లో 41 పరుగులతో రాణించిన కరన్.. బ్యాటింగ్లో 108, బౌలింగ్లో సంయుక్తంగా 71, ఆల్రౌండర్ల జాబితాలో ఆరు స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానానికి చేరుకున్నాడు. సీనియర్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ మూడో టీ20లో 2/14తో రాణించి బౌలింగ్ ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి చేరాడు. తన రెండో టీ20లోనే 4 వికెట్లు తీసిన పేసర్ జోష్ టాంగ్ 301వ స్థానంతో ర్యాంకింగ్స్లోకి ప్రవేశించాడు. బంతితో రాణించిన విల్ జాక్స్ 6 స్థానాలు ఎగబాకి ఆల్రౌండర్ల విభాగంలో 7వ ర్యాంకుతో టాప్-10 లోకి దూసుకొచ్చాడు.







