అమరావతిలో వేగంగా అభివృద్ధి అడుగులు

ఉండవల్లి జోన్-11లో రూ.426 కోట్ల పనులకు ఆమోదం

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ఉండవల్లి జోన్-11 పరిధిలో ట్రంక్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.426.46 కోట్ల వ్యయంతో భారీ మౌలిక సదుపాయాల పనులను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు కింద రోడ్డు, డ్రైన్లు, సరఫరా, సెవరేజ్ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యుత్ సరఫరా, ఐసీటీ యుటిలిటీ డక్ట్లు, రీయూజ్ వాటర్ లైన్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎస్‌టీపీ ఏర్పాటు, అవెన్యూ ప్లాంటేషన్ పనులను ఈ ప్యాకేజీలో భాగంగా అమలు చేయనున్నారు.

అమరావతి ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ల అభివృద్ధికి అవసరమైన ఈ పనులను ప్యాకేజీ-38 కింద చేపట్టనున్నారు. ఎల్-1 బిడ్డర్‌గా ఎంపికైన ఎన్‌సీసీ లిమిటెడ్‌కు పనులను కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంచనా వ్యయం రూ.409.78 కోట్లు ఉండగా, 4.07 శాతం అధిక బిడ్‌కు అనుమతి ఇచ్చింది. ఈ కాంట్రాక్ట్‌కు రెండేళ్ల డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌ను నిర్దేశించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి జూన్ 19న జరిగిన ఏపీసీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో తీర్మానం నెం.669/2026 ఆమోదం పొందింది. అనంతరం ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం.777ను జారీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. పనుల అవార్డు జారీ చేసేందుకు ఏడీసీఎల్ సీఎండీకి అధికారాలను అప్పగించింది.

ఉండవల్లి ప్రాంతంలో సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా రాజధాని నిర్మాణానికి మరింత వేగం చేకూరనుంది. ఈ ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధులను ఏపీసీఆర్‌డీఏ సమకూర్చనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.