దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, క్యూ1 ఫలితాలపై ఆశావహ దృక్పథం పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమైంది. ముఖ్యంగా ఆటో, రియల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఈ క్రమంలో వరుసగా నాలుగో రోజూ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 521 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 24,400 పాయింట్ల పైకి ఎగబాకింది. 

 నిఫ్టీ 159.50 పాయింట్ల లాభంతో 24,430.35 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బీఈఎల్‌, రిలయన్స్‌, ఐసీఐసీఐ, మారుతీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. కోటక్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ లిమిటెడ్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 95.38గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 71.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్స్‌ ధర 4,148.34 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.