రాయలసీమ న్యూస్, కర్ణాటక డెస్క్: తన ప్రేమను నిరాకరించిందని ఉన్మాదిగా మారిన యువకుడు.. రద్దీగా ఉండే బస్టాండ్లో యువతిని దారుణంగా హత్య చేశాడు. బాధితురాలు లావణ్యకు నిందితుడు చేతన్ వరసకు బంధువు అవుతాడని సమాచారం. అతను కొంతకాలంగా లావణ్యను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతుండగా, ఆమె అతని ప్రేమను నిరాకరించింది. దాంతో పగ పెంచుకున్న చేతన్, బంట్వాల్లోని రద్దీగా ఉండే కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికులు అందరూ చూస్తుండగానే లావణ్యపై దాడి చేసి ప్రాణాలు తీశాడు. బహిరంగ ప్రదేశంలో జరిగిన ఈ క్రూరమైన హత్య సంఘటన స్థానిక ప్రజలను షాక్కు గురి చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. హత్యకు గల ఖచ్చితమైన కారణాల గురించి వివరాలను సేకరిస్తున్నారు. హత్య చేసిన వెంటనే దుండగుడు పారిపోయాడు. అతని కోసం అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు చేతన్ను త్వరగా గుర్తించి.. కఠినమైన శిక్షపడేలా చేస్తామన్నారు అధికారులు. బంట్వాల్ ప్రాంతంలో రద్దీగా ఉండే బస్టాండ్లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో చర్చనీయాంశంగా మారింది.







