రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
గుజరాత్లోని అహ్మదాబాద్లో 149వ జగన్నాథ రథయాత్ర గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పూరీ తర్వాత దేశంలోనే అతిపెద్ద రెండో రథయాత్రగా ఇది పేరొందింది. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన మంగళ హారతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉపముఖ్యమంత్రి హర్ష సంఘవి సంప్రదాయబద్ధంగా 'పహింద్' విధిని నిర్వహించి, రథాలను ప్రారంభించారు.
జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి రథాలు జమాల్పూర్ ఆలయం నుంచి బయలుదేరి నగరం గుండా సాగుతున్నాయి. ఈ యాత్రలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, భజన బృందాలు, అఖారాలు పాల్గొన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రత కోసం 30,000 మంది సిబ్బందిని, సుమారు 3,700 ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు, డ్రోన్లను పోలీసులు రంగంలోకి దించారు. భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. యాత్ర మార్గంలో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. అటు భక్తులు నామస్మరణతో నగరాన్ని భక్తిపారవశ్యంతో ముంచెత్తుతున్నారు.
రథయాత్ర భారత సంస్కృతికి ప్రతీక: ప్రధాని మోడీ
రథయాత్ర సందర్భంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. “రథయాత్ర పవిత్ర సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఇది భారతదేశ శాశ్వత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రకాశవంతమైన ప్రతీక. రథయాత్ర సంప్రదాయాలు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తరతరాల ప్రజలను ప్రేరేపించాయి. వినయం, సామూహిక భాగస్వామ్యం, నిస్వార్థ సేవ వంటి విలువలను ఈ ఉత్సవం ప్రతిబింబిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. అలాగే మహాప్రభు జగన్నాథుడు అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, సమాజంలో ఐక్యతా భావాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రార్థించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశ విదేశాల్లోని జగన్నాథ భక్తులకు రథయాత్ర శుభాకాంక్షలు తెలిపారు. భక్తుడు, భగవంతుని కలయికకు ప్రతీకగా నిలిచే ఈ మహోత్సవం ఎంతో విశిష్టమైనదని ఆమె పేర్కొన్నారు. మహాప్రభు జగన్నాథుడు, సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథయాత్ర ద్వారా భక్తుల వద్దకు రావడం భక్తి సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఘట్టమని ఆమె అన్నారు. దేశంలో శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి నిరంతరం కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు.







