రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: టీమ్ఇండియాపై అద్భుత ప్రదర్శనతో రెండు టీ20ల సిరీస్ను కైవసం చేసుకున్న ఐర్లాండ్ జట్టులో పేసర్ జై ముంద్రా కీలక పాత్ర పోషించాడు. భారత్తో జరిగిన ఈ చారిత్రాత్మక సిరీస్లో అతడి బౌలింగ్ ప్రతిభ ఐర్లాండ్ విజయానికి బలమైన పునాది వేసింది.
తొలి టీ20లో 28 ఏళ్ల జై ముంద్రా రెండు వికెట్లు తీసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. రెండో టీ20లో మరింత మెరుగైన ప్రదర్శనతో మూడు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. ఈ రెండు మ్యాచ్లలో అతడి ప్రదర్శనకు గుర్తింపుగా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు కూడా దక్కించుకున్నాడు.
టీమ్ఇండియాపై ఐర్లాండ్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయానికి మూలం భారత్లోనే ఉంది. రాజస్థాన్లోని తోంక్లో జన్మించిన జై ముంద్రా.. ఉన్నత విద్య కోసం ఐర్లాండ్ చేరాడు. డబ్లిన్లోని టెక్నలాజికల్ యూనివర్సిటీ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి 2021లో ఐర్లాండ్కు వెళ్లిన అతడు, అక్కడే క్రికెట్ కెరీర్కు నాంది పలికాడు.
మాస్టర్స్ పూర్తిచేసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పని చేసిన జై.. అనంతరం ప్రొఫెషనల్ క్రికెటర్గా మారాలని నిర్ణయించుకున్నాడు. డబ్లిన్లోని లేమిన్స్టర్ క్లబ్లో చేరి స్థానిక స్థాయిలో క్రికెట్ ఆడుతూ తన ప్రతిభను నిరూపించాడు. ఎడమ చేతి వాటం పేసర్గా అతడి బౌలింగ్ ఐర్లాండ్ క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించింది.
ఈ క్రమంలో 2024లో ఐర్లాండ్ ఇంటర్ - ప్రొవిన్సియల్ T20 టోర్నమెంట్లో ఆడే అవకాశం జైకి లభించింది. అదే ఏడాది అతడి తండ్రి గిరిరాజ్ ముందర మరణించడం కుటుంబానికి పెద్ద దెబ్బగా మారింది. అయినప్పటికీ ప్రొవిన్షియల్ టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ తన ఆటతీరును మెరుగుపరుచుకున్నాడు.
స్థానిక టోర్నీల్లో చూపిన ప్రదర్శన ఆధారంగా ఇటీవల టీమ్ఇండియాతో జరిగిన టీ20 సిరీస్కు ఐర్లాండ్ జట్టులో జై ముంద్రా ఎంపికయ్యాడు. భారత్కు ఆడాలన్న తన తండ్రి కలను నెరవేర్చలేకపోయినా.. ఐర్లాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం అతడికి దక్కింది.
భారత్తో తొలి టీ20లో మొదటి బంతికే సంజు శాంసన్ ను ఔట్ చేసి జై ముంద్రా అందరి దృష్టిని ఆకర్షించాడు. కీలక సమయంలో వికెట్లు తీస్తూ మ్యాచ్ గమనాన్ని మార్చడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. 2025లో జైకి ఐరిష్ పౌరసత్వం లభించడంతో అతడు ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో స్థిరపడే మార్గం సుగమమైంది.
భారత్ నేలలో జన్మించి, ఐర్లాండ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ టీమ్ఇండియాపై సిరీస్ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన జై ముంద్రా.. రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలకు ఒక ప్రత్యేక అధ్యాయాన్ని జోడించినట్టయ్యాడు.







