రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
అతివిశ్వాసం టీమ్ఇండియా కొంపముంచింది..
ఘోర ఓటమిపై మాజీల ఆగ్రహం
టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత టీమ్ఇండియా ఆడిన తొలి అంతర్జాతీయ సిరీస్లోనే ఘోర పరాజయం ఎదురైంది. చిన్న జట్టుగా భావించిన ఐర్లాండ్ చేతిలో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-2 తేడాతో కోల్పోవడంతో భారత జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛాంపియన్ జట్టుగా ఉన్న టీమ్ఇండియా ఈ సిరీస్ను అత్యంత సౌమ్యంగా తీసుకోవడమే ఓటమికి కారణమని క్రికెట్ విశ్లేషకులు, మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.
యువ బ్యాటర్లు, ఆల్రౌండర్లు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఐర్లాండ్ను చిత్తు చేయడంలో భారత్ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ జట్టు చేతిలో భారత్ తొలిసారిగా టీ20 సిరీస్ను కోల్పోవడం గమనార్హం. చిన్న జట్టు అనే నిర్లక్ష్య భావన, అతివిశ్వాసం కలిసివచ్చి ఈ పరాజయానికి దారితీసిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
మాజీ క్రికెటర్ శఠగోపన్ రమేశ్ టీమ్ఇండియా వైఖరిపై ఘాటుగా స్పందించారు.
‘‘ఐర్లాండ్తో టీ20 సిరీస్ను భారత్ చాలా తేలికగా తీసుకుంది. భోజనంలో పచ్చడిలా భావించింది. ఇంగ్లాండ్తో సిరీస్కు ముందు తొలి దెబ్బ తగిలింది. పచ్చడిలో ఘాటు కాస్త ఎక్కువైనట్లు ఉంది. టీమ్ఇండియా చరిత్రలోనే అతి భయంకరమైన ఓటమి ఎదురైంది. అతి విశ్వాసం ఎప్పుడూ ఆరోగ్యానికి మంచిది కాదు. ఐర్లాండ్తో భారత జట్టు ఇలానే ఆడింది. ఆత్మవిశ్వాసంతో ఉండటం తప్పుకాదు. కానీ ఓవర్కాన్ఫిడెన్స్ చాలా ప్రమాదకరం. టీ20 ప్రపంచకప్ను గెలిచాం. రెండు నెలల పాటు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. అయినా ఐర్లాండ్ చేతిలో అభాసుపాలయ్యాం. తొలి మ్యాచ్లో క్యాచ్లను డ్రాప్ చేశారంటే సరేలే అని సర్దిచెప్పాం. రెండో టీ20లో తక్కువ స్కోరు ఉన్నా సరే విజయం సాధించడంలో వెనుకబడిపోయాం. ఫీల్డింగ్ నాసిరకంగా ఉంది. బ్యాటింగ్లో బాధ్యత తీసుకొనేవారు తగ్గిపోయారు. ఐపీఎల్లో చాలా మంది ఫీల్డింగ్ చేయకుండా ‘ఇంపాక్ట్ రూల్’తో తప్పించుకున్నారు. అదే ఇప్పుడు కొంపముంచింది’’ అని రమేశ్ వ్యాఖ్యానించాడు.
మాజీ బ్యాట్స్మన్, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా భారత బ్యాటింగ్ వైఫల్యాన్ని ఎత్తిచూపాడు.
‘‘జట్టులో ఒకరిద్దరు ఆడితే విజయాలు వరించవు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. మరీ ముఖ్యంగా షాట్ల ఎంపిక అత్యంత దారుణం. తొమ్మిదో నంబర్ వరకూ బ్యాటింగ్ చేయగల జట్టు మనది. తొలి మ్యాచ్లో ఐర్లాండ్ 180+ స్కోరు చేయగలిగింది. కానీ మనం అక్కడి వరకూ వెళ్లలేకపోయాం. ఇప్పుడు రెండో టీ20లో బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఐర్లాండ్ను 150+కే కట్టడి చేశారు. కానీ టాప్ ఆర్డర్ దారుణమైన ప్రదర్శనతో ఓటమిని కొనితెచ్చుకున్నాం. తిలక్, హర్షిత్ రాణా మినహా ఎవరూ ప్రభావం చూపించలేదు. ఆఖర్లో వచ్చిన ప్రిన్స్ కూడా సిక్స్తో ఆకట్టుకున్నాడు. కానీ మిగతా బ్యాటర్లు మాత్రం బాధ్యతగా ఆడలేదు’’ అని చోప్రా విమర్శించాడు.
జట్టు ఎంపిక, యువ ఆటగాళ్లకు అవకాశాల విషయంలో మేనేజ్మెంట్ తీరు సరిగా లేదని మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు..
ఐర్లాండ్తో సిరీస్ పరాజయం తర్వాత టీమ్ఇండియా, కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. వరుస విజయాల తర్వాత వచ్చిన ఈ ఆకస్మిక ఓటమి, జట్టు అతివిశ్వాసం, ఎంపిక విధానంపై మాజీల విమర్శలకు దారితీసింది. రాబోయే సిరీస్లకు ముందు టీమ్ఇండియా తీరుతెన్నులు, వ్యూహాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని క్రికెట్ వర్గాలు సూచిస్తున్నాయి.







