కాంగ్రెస్ దిల్లీ దర్బార్‌కు ఏటీఎంగా తెలంగాణ

: భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

కాంగ్రెస్‌ దిల్లీ దర్బార్‌కు తెలంగాణ రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చారని భాజపా(BJP) జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అధ్యక్షతన మల్కాజిగిరిలోని ఔషాపూర్‌ రాక్‌ ఎంక్లేవ్‌లో జరిగిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నితిన్‌ నబీన్‌ మాట్లాడారు. 

‘‘మోదీ నేతృత్వంలో భాజపా వెంట నడిచేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భాజపాను గెలిపించిన రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. దేశంలో 12 ఏళ్లలో చాలా పరివర్తన వచ్చింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పశ్చిమబెంగాల్‌లో ఎలా గెలిచారని చాలా మంది నన్ను అడుగుతున్నారు. భాజపా కార్యకర్తల కష్టాలతో పశ్చిమబెంగాల్‌లో గెలిచామని చెప్పాను. అక్కడ పార్టీ కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురిచేశారు. అయినా, లెక్కచేయకుండా భాజపాని గెలిపించాలనే ఆలోచనతో వారు పనిచేశారు. సర్‌పై ప్రజలకు భాజపా కార్యకర్తలు అవగాహన కల్పించాలి. తెలంగాణలో సర్‌పై ప్రజలు సంతోషంగా ఉన్నారు. తెలంగాణలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ విధిస్తున్నారు. ఇక్కడి నుంచి దిల్లీకి డబ్బులు వెళ్తున్నాయి. దిల్లీ దర్బార్‌కు తెలంగాణ ఏటీఎంగా మార్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు ఇచ్చింది.. కానీ, ఒక్కటికూడా పూర్తి చేయలేదు. కాంగ్రెస్‌.. అవినీతి, నేరాల తరహా పాలన చేస్తున్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ కలిసే ఉన్నాయి. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది’’ అని నితిన్‌ నబీన్ ఆరోపించారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.