ప్రొద్దుటూరు: స్థానిక శ్రీవేదవ్యాస డిగ్రీ కాలేజీ విద్యార్థులు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ TCS నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. డిగ్రీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో TCS సంస్థ ముందుగా కాలేజీ ప్రాంగణంలో రాత పరీక్ష నిర్వహించింది.

ఈ రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులు తదుపరి దశకు అర్హత సాధించారు. అనంతరం హైదరాబాద్‌లో వీరికి తుది విడత ముఖాముఖి ఇంటర్వ్యూ పరీక్షలు నిర్వహించగా, అందులో ఉత్తీర్ణత సాధించిన పీ. గాయత్రి, యు. మీనాక్షి, ఎస్. రాజేశ్వరి, ఎమ్. వెంకట ధనుష్, కె. పూజిత, ఎస్. యూనస్, జే. వెంకట ధరణి, పి. స్మైలీ, వి. మహేశ్వరరెడ్డి TCSలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా కాలేజీ కరస్పాండెంట్ ఎల్. నాగేశ్వరరెడ్డి విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు, ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ విద్యా సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇంతటి ప్రతిష్టాత్మక సాఫ్ట్‌వేర్ సంస్థలో తమ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం కాలేజీకే గర్వకారణమని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం కాలేజీ ప్రెసిడెంట్ జి. సుదర్శనరెడ్డి మారుతున్న పోటీ ప్రపంచంలో కేవలం విద్యా అర్హతలతో పాటు సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను నిరంతరం పెంపొందించుకుంటే సాఫ్ట్‌వేర్ రంగంలో సులభంగా రాణించవచ్చని సూచించారు.

ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను కాలేజీ ప్రెసిడెంట్ జి. సుదర్శనరెడ్డి, ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ రవి, రామలక్ష్మి రెడ్డి, అధ్యాపక బృందం మరియు సిబ్బంది అభినందించారు. ఎంపికైన విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో పాటు కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు.