రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
టీషర్ట్ వివాదంపై రితేశ్ దేశ్ముఖ్ క్షమాపణ
ముంబై: బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేశ్ దేశ్ముఖ్ తాజాగా టీషర్ట్ వివాదంలో చిక్కుకుని సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన మరాఠీ చిత్రం ‘రాజా శివాజీ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ పార్టీకి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ కావడంతో ఈ వివాదం చెలరేగింది.
ఆ వీడియోలో రితేశ్ ఛత్రపతి శివాజీ మహరాజ్ ఫొటో ముద్రించిన టీషర్ట్ ధరించి డ్యాన్స్ చేస్తుండడం కనిపించింది. దీనిపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. శివాజీ మహారాజ్ చిత్రంతో ఉన్న దుస్తుల్లో పార్టీ చేసుకోవడం, డ్యాన్స్ చేయడం ద్వారా ఆయనను అవమానించారని ఆరోపించారు. అంతేకాక, సక్సెస్ పార్టీలో మద్యం సేవించి డ్యాన్స్ చేశారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైంది.
ఈ విమర్శలపై రితేశ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించారు. వీడియోపై వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో తాను శివుడు, శివాజీ మహారాజ్ భక్తుడిగా స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యతగా భావిస్తున్నట్టు తెలిపారు. టీషర్ట్ ధరించిన ఉద్దేశ్యం, పార్టీకి హాజరైన పరిస్థితుల గురించి వివరించారు.
అలాగే, ఈ ఘటన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నాయనుకుంటే క్షమించమని రితేశ్ కోరినట్టు వార్తల్లో వెల్లడైంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ పట్ల తనకు అపార గౌరవముందని ఆయన స్పష్టం చేశారని పేర్కొన్నారు.
రితేశ్ దర్శకత్వంలో రూపొందిన ‘రాజా శివాజీ’ మరాఠీ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రం రూ.117.41 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో జెనీలియా, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్ తదితరులు కీలక పాత్రలు పోషించగా, సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించారు.













