రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
విమాన ప్రయాణికులపై భారం పడనివ్వబోం
: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్
విమాన ప్రయాణికులను దోపిడీ చేసే స్థాయిలో ధరలు పెరిగితే కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని చర్యలు తీసుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రయాణికులపై భారం పడనివ్వబోమని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో ఉడాన్ 2.0 వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఉడాన్ 2.0తో మరో పదేళ్ల పాటు ప్రాంతీయ విమానయానానికి ప్రయోజనం కలుగుతోందని రామ్మోహన్ తెలిపారు. ప్రాంతీయ విమానయాన అనుసంధానాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం ఉడాన్ పథకాన్ని మరో పదేళ్ల పాటు పొడిగించిందని వెల్లడించారు. జులై 4వ తేదీన జోధ్పూర్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉడాన్ పథకాన్ని ప్రారంభించారని ప్రస్తావించారు. 1.66 కోట్ల మంది ప్రయాణికులు ఉడాన్ పథకం ద్వారా ప్రయోజనం పొందారని చెప్పుకొచ్చారు. రాబోయే పదేళ్లలో ఉడాన్ పథకాన్ని అమలు చేయడానికి కేంద్రం రూ. 29 వేల కోట్ల నిధులను కేటాయించిందని తెలిపారు. రాబోయే పదేళ్లలో 100 కొత్త విమానాశ్రయాలు, 200 కొత్త హెలిప్యాడ్లు ఏర్పాటు చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని రామ్మోహన్ పేర్కొన్నారు.







