రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహాకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమల్లేశ్వర స్వామిని సోమవారం మంత్రి అచ్చెన్న దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రైతాంగం సుభిక్షంగా ఉండాలని కనకదుర్గమ్మను దర్శించుకున్నట్లు చెప్పుకొచ్చారు. పంటలు సమృద్ధిగా పండాలని, రైతులకు మంచి దిగుబడులు రావాలని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు.

గుంటూరు లామ్‌లో ఏరువాక కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువులు, విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు. ఖరీఫ్ సాగుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వివరించారు. ఎల్‌నినో పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొందామని రైతులకు పిలుపునిచ్చారు. ప్రతి రైతు సంతోషంగా ఉండాలని, ప్రతి ఎకరం పచ్చగా కళకళలాడాలని కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.