రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
రాయలసీమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
: వైసీపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సవాల్
రెండు దశాబ్దాలుగా కడప ప్రజల స్టీల్ ప్లాంట్ ఆకాంక్షను కూటమి ప్రభుత్వం సాకారం చేస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తెలిపారు. 2028 నాటికి కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేసి రాయలసీమ యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. సోమవారం రాజధాని అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు గొడ్డలి పార్టీకి లేదని పునరుద్ఘాటించారు. ‘కడప స్టీల్ ప్లాంట్ నిర్మించకపోతే ఓట్లు అడగను’ అని 2019లో మాట ఇచ్చి మడమ తిప్పిన వ్యక్తి జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.
2019లో ఓ సారి, 2023లో మరోసారి స్టీల్ ప్లాంట్ పేరుతో ప్రజలను మోసం చేసి.. ఐదేళ్లలో ఒక్క ఇటుక కూడా వేయని కడప ద్రోహి జగన్ రెడ్డి అని గుర్తు చేశారు. ఐదేళ్ల పాలనలో పులివెందులకే ఒక్క కొత్త పరిశ్రమను తీసుకురాలేక, ఒక్క స్థిరమైన ఉద్యోగాన్ని కూడా సృష్టించలేని వైఫల్యాన్ని ప్రజలు మర్చిపోలేదని టీడీపీ ఎమ్మెల్సీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
నేడు తమ ప్రభుత్వం రాయలసీమను పరిశ్రమల స్థాపనకు కేంద్రంగా మార్చిందని చెప్పారు. 2019 –2024 మధ్య ఆ పార్టీ పాలనలో గొడ్డలి ఫ్యాక్టరీలు, ఫేక్ ఫ్యాక్టరీలు వచ్చాయి.. తప్ప కడప స్టీల్ ప్లాంట్ మాత్రం రాలేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. రాయలసీమ అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటు గొడ్డలి పార్టీ నాయకులకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు.







