రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: ఐర్లాండ్ టీ20 సిరీస్ సందర్భంగా టీమ్ఇండియాలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ సిరీస్కు శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా నియమించగా, యువ బ్యాట్స్మన్ తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. అంతర్జాతీయ కెరీర్ ప్రారంభ దశలోనే తిలక్కు వచ్చిన ఈ పదవి క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అయితే డిప్యూటీ సారథి హోదా వచ్చినంత మాత్రాన జట్టులో స్థానం శాశ్వతం కాదని మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పష్టం చేశాడు. తిలక్ కెరీర్లో ఇది గుర్తించదగిన మైలురాయి అయినప్పటికీ, అదే సమయంలో అతనిపై అంచనాలు, బాధ్యతలు కూడా భారీగా పెరిగాయని ఆయన విశ్లేషించాడు.
“తిలక్ వర్మ ఇప్పుడు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ అందుకొన్నాడు. డిప్యూటీ అయినంత మాత్రాన అతడికి తుది జట్టులో స్థానం గ్యారంటీ అని అర్థం కాదు. అలా ఆలోచిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. అతడు జట్టులో ఉండాలనుకుంటే ఫామ్ను కొనసాగించాలి. పరుగులు చేయలేకపోతే వైస్ కెప్టెన్ అయినా జట్టులో స్థానం ఉండదు. ఇంతకుముందు అక్షర్ పటేల్, శుభ్మన్ గిల్ పరిస్థితి కూడా ఇదే. తిలక్ వర్మ వారిద్దరినీ గుర్తు పెట్టుకోవాలి” అని కైఫ్ తెలిపాడు.
ప్రస్తుతం భారత జట్టులో ఎవరికైనా, ఏ హోదాలో ఉన్నా, ప్రదర్శన ఆధారంగానే అవకాశాలు లభిస్తున్నాయని కైఫ్ అభిప్రాయపడ్డాడు. స్థిరమైన స్థానం అన్న భావన ఎవరికీ ఉండకూడదని, అది కెప్టెన్ అయినా, వైస్ కెప్టెన్ అయినా వర్తిస్తుందని ఆయన వ్యాఖ్యానించాడు.
“భారత జట్టులో సరిగా ఆడని ఎవరైనా సరే తమ స్థానంపై గ్యారంటీ పెట్టుకోకూడదు. అది కెప్టెన్ అయినా సరే. ఇక్కడ పర్మినెంట్ వైస్ కెప్టెన్ అంటూ ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ తమ ప్లేస్ కోసం పరుగులు చేయాల్సిందే. ఇప్పుడున్న కోచ్, సెలక్టర్ల మైండ్సెట్ ఇలానే ఉంది. ప్రతి మ్యాచ్లో ప్రదర్శన ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయి” అని కైఫ్ విశ్లేషించాడు.
ఐర్లాండ్ సిరీస్తో తిలక్ వర్మకు నాయకత్వ బాధ్యతల రూపంలో కొత్త సవాలు ఎదురవుతోంది. బ్యాటింగ్లో స్థిరమైన ప్రదర్శనతో పాటు, జట్టును నడిపించే సామర్థ్యాన్ని కూడా ఈ సిరీస్లో నిరూపించుకోవాల్సి ఉంటుంది. యువ క్రికెటర్లకు అవకాశాలు పెరుగుతున్న ఈ దశలో, హోదా కంటే ఫామ్, క్రమం తప్పని ప్రదర్శనకే ప్రాధాన్యం ఉంటుందని కైఫ్ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేశాయి.







