రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
కోకోస్ దీవుల్లో తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్
భారతదేశపు మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్యాన్'కు అంతర్జాతీయంగా భారీ మద్దతు లభించింది. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్కు మద్దతుగా ఆస్ట్రేలియాకు చెందిన కోకోస్ (కీలింగ్) దీవులలో తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు.
మూడు దేశాల పర్యటనలో భాగంగా నిన్న ఆస్ట్రేలియా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో మెల్బోర్న్లో జరిపిన సంయుక్త మీడియా సమావేశంలో అల్బనీస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక, సాంకేతిక బంధానికి ఈ నిర్ణయం అద్దం పడుతోంది.
'భారత్, ఆస్ట్రేలియాల మధ్య అంతరిక్ష, సాంకేతిక రంగాలలో సహకారాన్ని మరింత విస్తరిస్తున్నాం. ఇందులో భాగంగానే భారత్ చేపట్టబోయే చరిత్రాత్మక గగన్యాన్ మానవ అంతరిక్ష యాత్రకు మద్దతుగా కోకోస్ దీవులలో తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్ను కమిషన్ చేయడానికి మేము అంగీకరించాం'. అని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చెప్పారు.







