రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్: జులై 8న వైఎస్ జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు
వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నియోజక వర్గం పులివెందుల చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి. మంగళవారం పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించనున్న ఆయన, రేపు జులై 8 బుధవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం, నేడు ఉదయం 11.30 గంటలకు జగన్ పులివెందుల చేరుకున్న అనంతరం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. కార్యక్రమం అనంతరం పులివెందులలోనే రాత్రికి బస చేయనున్నారు. ఇక, రేపు ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకోనున్నారు. అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కాగా, తన సొంత నియోజకవర్గానికి వెళ్లిన ప్రతీసారి వైఎస్ జగన్.. ప్రజా దర్బార్ నిర్వహించి.. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడం.. వారి నుంచి వినతిపత్రాలు స్వీకరించడం జరుగుతున్న విషయం విదితమే..







