రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించి నిరాశలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టుకు శుభవార్త అందింది. 2028లో జరగనున్న ఒలింపిక్ క్రీడలకు హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు అర్హత సాధించింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ ), ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధికారికంగా ధ్రువీకరించాయి.
ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్లో టీం ఇండియా సెమీ ఫైనల్స్కు చేరుకోలేకపోయింది. అయితే ఈ టోర్నీలో ఆసియా ఖండానికి ప్రాతినిధ్యం వహించిన జట్లలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఆసియా జట్లలో భారత్ సాధించిన ఈ ఉత్తమ ర్యాంకింగ్ ఆధారంగా 2028 ఒలింపిక్స్లో క్రికెట్ విభాగానికి భారత మహిళల జట్టుకు ప్రత్యక్ష ప్రవేశం లభించింది.
భారత్తో పాటు ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ , సౌత్ ఆఫ్రికా మహిళల జట్లు కూడా 2028 ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాల కోసం ఇతర జట్ల మధ్య అర్హత పోటీలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ అర్హతతో భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రపంచ క్రీడా వేదికపై మరొక కీలక అవకాశమొచ్చినట్టైంది.
2028 ఒలింపిక్ గేమ్స్ ను యునైటెడ్ స్టేట్స్ లోని లోడ్ అంగెల్స్ నగరంలో నిర్వహించనున్నారు. అక్కడి వేదికలపై వివిధ క్రీడలతో పాటు క్రికెట్ పోటీలు కూడా జరగనున్నాయి. మొత్తం ఆరు జట్లతో మహిళల క్రికెట్ టోర్నీని నిర్వహించే ప్రణాళికను నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో అర్హత సాధించిన జట్లకు సిద్ధత కార్యక్రమాలు, ప్రత్యేక శిక్షణ శిబిరాలు, అంతర్జాతీయ సిరీస్లు నిర్వహించే దిశగా ఆయా బోర్డులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఒలింపిక్ చరిత్రలో క్రికెట్ ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే భాగమైంది. 1900లో పారిస్ ఒలింపిక్స్లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఆ తర్వాత నుంచి ఈ క్రీడ ఒలింపిక్ కార్యక్రమంలో చోటు చేసుకోలేదు. దాదాపు 128 ఏళ్ల తర్వాత 2028 లోడ్ అంగెల్స్ ఒలింపిక్స్ ద్వారా క్రికెట్ మరోసారి ఒలింపిక్ వేదికపైకి రావడం విశేషంగా నిలిచింది.
టీ20 ప్రపంచ కప్లో సెమీ ఫైనల్స్ దశకు చేరుకోకపోవడం భారత మహిళల జట్టుకు నిరాశ కలిగించినా, అదే టోర్నీ ప్రదర్శన ఆధారంగా ఒలింపిక్ బెర్త్ దక్కించుకోవడం జట్టుకు, అభిమానులకు ఊరటనిచ్చే పరిణామంగా భావిస్తున్నారు. 2028 ఒలింపిక్స్లో మెడల్ కోసం పోటీ పడే అవకాశం లభించిన నేపథ్యంలో, భారత మహిళల క్రికెట్ జట్టు భవిష్యత్ ప్రణాళికలు, జట్టు నిర్మాణం, యువ ఆటగాళ్లకు అవకాశాల విషయంలో బోర్డు అఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ( బీసీసీఐ ) కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.







