రాయలసీమ న్యూస్, అన్నమయ్య: సంబేపల్లి మండలం రైతుకుంటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ పనులు చేస్తూ ప్రైవేటు కూలిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. లైన్మెన్ సాంబశివారెడ్డి వద్ద రౌతుకుంటకు చెందిన బత్తిన మనోహర్ ప్రైవేటు కూలిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం దేవపట్ల మిట్ట వద్ద ఉన్న ఓ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్కు సంబంధించి పొలం నుంచి నియంత్రికకు విద్యుత్ తీగలను ఏర్పాటు చేసే పనులు చేపట్టారు. ఈ క్రమంలో మనోహర్ కరెంటు స్తంభం ఎక్కి తీగలు అమర్చుతున్నాడు.
అప్పటికే లైన్లో విద్యుత్ ప్రవాహం ఉండగా, మనోహర్ అనుకోకుండా విద్యుత్ తీగలను తాకినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతడు ఘోర విద్యుదాఘాతానికి గురై స్తంభంపైనే కుప్పకూలాడు. సహాయకులు, స్థానికులు ప్రయత్నించినప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
మనోహర్ మృతి వార్త తెలిసిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని కిందకు దింపి, జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం, ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. వారి నిరసనతో మూడు గంటల పాటు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్థంభించాయి.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడి పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. రాయచోటి విద్యుత్ శాఖ డీఈ లివింగ్స్టన్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో చర్చించారు. ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.
మృతుడైన బత్తిన మనోహర్ కుటుంబంలో భార్య రామాంజులమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ పోషణ బాధ్యతలన్నీ మనోహర్పైనే ఉండడంతో, అతడి మృతితో కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడే పరిస్థితి నెలకొంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.













