రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల: ఎంబీబీఎస్ అడ్మిషన్లలో రిజర్వేషన్ విద్యార్థులకు న్యాయం జరిగేలా జీవో నెం.102ను రద్దు చేసి, జీవో నెం.151ను అమలు చేయాలని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుమాల శోభన్బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా జీవో 102 ఉందని ఆయన విమర్శించారు.
ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.102 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించేలా ఉందని శోభన్బాబు పేర్కొన్నారు. మెరిట్లో మంచి మార్కులు సాధించిన రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో సీట్లు పొందే అవకాశాన్ని ఈ జీవోతో కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన తెలిపారు.
మెడికల్ రిజర్వేషన్లలో ఉన్న లోపాలను సరిచేసేందుకు 2019లో రాష్ట్ర హైకోర్టు నియమించిన ఆరుగురు నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా రూపొందిన జీవో నెం.151ను అమలు చేయాలని శోభన్బాబు డిమాండ్ చేశారు. అన్ని వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించే విధంగా జీవో 151 అమలు చేస్తే సామాజిక న్యాయాన్ని కాపాడిన ప్రభుత్వంగా గుర్తింపు పొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
జీవో నెం.102 ప్రకారం మెరిట్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు రిజర్వేషన్ కేటగిరీలోనే ఆప్షన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని శోభన్బాబు తెలిపారు. దీని వల్ల తమ మెరిట్కు అనుగుణంగా ఓపెన్ కేటగిరీలో సీటు పొందే అవకాశాన్ని విద్యార్థులు కోల్పోతారని ఆయన పేర్కొన్నారు. మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో సీటు పొందగలిగే విద్యార్థులను రిజర్వేషన్ కేటగిరీలోనే పరిమితం చేయడం వల్ల ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులు తమకు దక్కాల్సిన సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
అడ్మిషన్ల ప్రక్రియలో సామాజిక న్యాయం, రాజ్యాంగ హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని శోభన్బాబు కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను వంద శాతం దళితుల అభివృద్ధి, సంక్షేమానికే ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు ఈ నిధులను సమర్థంగా వినియోగించాలని సూచించారు.
2024 ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అదే వర్గాల విద్యార్థులకు అన్యాయం చేసే నిర్ణయాలు తీసుకోకూడదని శోభన్బాబు వ్యాఖ్యానించారు. జీవో నెం.102ను రద్దు చేసి జీవో నెం.151ను అమలు చేయడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన కోరారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 1950 నాటి ప్రెసిడెంటిల్ ఆర్డర్ ను వెంటనే రద్దు చేయాలని శోభన్బాబు డిమాండ్ చేశారు. విద్యా, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించే విధంగా విధానాలను రూపొందించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
జీవో నెం.102ను రద్దు చేసి, జీవో నెం.151ను అమలు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల హక్కులను కాపాడాలని గంగుమాల శోభన్బాబు స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం జరిగితే వైయస్ఆర్సీపీ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు.













