అనంతపూర్: అనంతపురం పట్టణంలో వరుసగా జరుగుతున్న మోటార్ సైకిళ్ల దొంగతనాల కేసులో 1-టౌన్ పోలీసులు బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యులతో ఉన్న ఈ ముఠా వద్ద నుంచి మొత్తం రూ.20 లక్షల విలువైన 20 చోరీ బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం 1-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో, అలాగే పరిసర ప్రాంతాల్లో ఇటీవల వాహన దొంగతనాలు పెరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పక్క సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు పలు ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు బయటపడింది.

పోలీసుల సమాచారం ప్రకారం, ప్రధాన నిందితుడు నార్పల గ్రామానికి చెందిన 20 ఏళ్ల కుమ్మర కిశోర్ బాబు ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇతనితో పాటు మరో ముగ్గురు బాలనేరస్తులు ఈ దొంగతనాల్లో భాగస్వాములుగా ఉన్నారు. వీరు నకిలీ తాళాలు ఉపయోగించి పార్కింగ్ స్థలాల్లో నిలిపిన బైక్‌లను క్షణాల్లో దొంగిలించేవారని పోలీసులు వెల్లడించారు.

దొంగిలించిన వాహనాలను ఎవరికీ అనుమానం రాకుండా సమీపంలోని కంపచెట్లలో దాచిపెట్టేవారని, అనంతరం వాటిని బెంగళూరు లేదా బళ్లారి పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు ప్లాన్ వేసేవారని విచారణలో తేలింది.

పోలీసులు స్వాధీనం చేసుకున్న 20 బైక్‌లు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించినవిగా గుర్తించారు. అందులో అనంతపురం 1-టౌన్ పరిధిలో దొంగిలించిన 13 మోటార్ సైకిళ్లు, అనంతపురం 4-టౌన్ పరిధిలో 4 మోటార్ సైకిళ్లు ఉన్నాయి. కదిరి పట్టణం నుంచి 1, తిరుపతి నుంచి 1, దొడ్డబళ్లాపూర్ (కర్ణాటక) నుంచి 1 మోటార్ సైకిల్‌ను ఈ ముఠా దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రధాన నిందితుడు కుమ్మర కిశోర్ బాబును రిమాండ్‌కు తరలించగా, మిగిలిన ముగ్గురు మైనర్లపై బాలనేరస్థుల చట్టం ప్రకారం చర్యలు చేపట్టారు.

వాహనదారులకు సూచనలు చేస్తూ పోలీసులు, బైక్‌లను పార్కింగ్ చేసే సమయంలో కేవలం హ్యాండిల్ లాక్‌పైనే ఆధారపడకుండా తప్పనిసరిగా అదనపు భద్రతా తాళాలు, వీల్ లాక్స్ లేదా అలారం లాక్స్ వాడాలని సూచించారు. పార్కింగ్ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తున్నట్లు గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని వాహనదారులను కోరారు.