విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు రూ.9,355 కోట్లు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఆమోదం

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు రూ.9,355 కోట్ల మంజూరుకు ఆమోదం తెలపడమే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం.. సచివాలయంలో సమావేశమైంది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు 2,943 తాగునీటి పథకాలు రూ.1,811.81 కోట్లతో చేపట్టేందుకు అమాత్యులు పరిపాలనా అనుమతులు ఇవ్వనున్నారు. దాదాపు 30కి పైగా అజెండా అంశాలతో మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. విశాఖపట్నంలో ఎన్‌ఐఏ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. తిరుపతి జిల్లాలో 63.01 ఎకరాలు సేకరించి లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించనుంది. పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో కాన్సర్ట్‌ల నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకొచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. ఎన్‌ఎఫ్‌డీబీకి రాజధానిలో భారీ అక్వేరియం, కార్యాలయం ఏర్పాటుకు, ఈశా ఫౌండేషన్‌, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, సీఐఐ గ్లోబల్‌ లీడర్‌షిప్‌ సెంటర్‌ సంస్థలకు భూ కేటాయంపులపై కేబినెట్‌ చర్చించి నిర్ణయం తీసుకోనుంది.